క్లుప్తంగా
వినోదానికి కొత్తదారి ఎక్స్యూవీ
సాక్షి,చైన్నె : విప్లవాత్మక అంశాలతో వినోదాన్నిపంచేందుకు సరికొత్త మార్గంగా ఎక్స్ యూవీ 7 ఎక్స్ ఓ కారును మహీంద్రా అండ్ మహీంద్ర ఆవిష్కరించింది. ఇది డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కలిగిన కారు అని, వినియోగదారులకు ఈ కారులో ప్రపంచ స్థాయి విజువల్స్ , స్పేషియల్ సౌండ్ అనుభవాన్ని పొందేందుకు వీలుగా రూపకల్పన చేసినట్టు ఆ సంస్థ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళిని కాంత్, బిజినెస్ హెడ్ మనీష్ అగర్వాల్లు ఫ్రకటించారు. స్థానికంగా ఈ కారును పరిచయంచేస్తూ ఇందులోని సరికొత్త అంశాలను వివరించారు. కారు సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్ఫాం ద్వారా సినిమాలు, టీవీ, లైవ్ స్పోర్ట్స్, ఒరిజినల్ సిరీస్లను నేరుగా అందిస్తుందని వివరించారు. సిస్టమ్–లెవల్ ఓటీటీ ఇంటిగ్రేషన్, డాల్బీ విజన్, డీటెయిల్స్ , డాల్బీ అట్మాస్ ధ్వనితో ఈ కారులో ప్రయాణం ప్రతి క్షణం మరింత ఆకట్టుకునే విధంగా, వినోదాత్మక అనుభవంతో ముందుకు సాగవచ్చు అని సూచించారు. మహీంద్రా , డాల్బీ సహకారంతో, వినియోగదారులు కారులో వినోదాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఇందులో అనేక అంశాలు ఉన్నాయన్నారు.
ఒప్పందం
స్థిరమైన విమాన ఇంధన సరఫరాను పెంచే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , ఆకాసా ఎయిర్ మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ ఏవీయేషన్ బిజినెస్ హెడ్ శైలేష్ ధర్ తదితరులు పాల్గొన్నారు.
– సాక్షి, చైన్నె
అన్నా డీఎంకే
జిల్లా కార్యదర్శిపై కేసు
తిరువత్తియూరు: పార్కును ధ్వంసం చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. కొరుక్కుపేట, మనలి రోడ్డు సున్నపు కాలువ కూడలిలో రోడ్డు పక్కన పార్కు నిర్మించి గత 29వ తేదీన ప్రారంభించారు. ఈ పార్కులో నిర్మాణ పనులు సరిగా జరగలేదని అన్నాడీఎంకే ఉత్తర చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.రాజేష్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చైన్నె కార్పొరేషన్ పార్కును ఆర్.ఎస్. రాజేష్ ధ్వంసం చేశారని కార్పొరేషన్ సహాయ ఇంజినీర్ శ్రీసత్యన్ కొడుంగయూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆర్.ఎస్.రాజేష్పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పార్కు వ్యవహారంపై సహాయ ఇంజినీర్ శ్రీసత్యన్ బంధువైన తమిళరసన్ తనకు బెదిరింపులు చేశారని ఆర్.ఎస్.రాజేష్ తండయార్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
లగ్జరీ ఐవేర్తో పెళ్లి సందడి
సాక్షి, చైన్నె: వెడ్డింగ్ ఎడిటర్ సీజన్ 5లో లగ్పరీ ఐవేర్తో పెళ్లి సందడికి ఏర్పాటు చేశామని ఆ సంస్థ డైరెక్టర్ ప్రియాంకా గుప్తా ప్రకటించారు. జీకేబీ ఆప్టికల్స్ సీజన్ 5 గురించి మంగళవారం ఆమె ప్రకటించారు. ఆరు దశాబ్దాల వారసత్వంతో దేశంలోని ప్రముఖ ప్రీమియం ఆప్టికల్ రిటైలర్గా తమ సంస్థ పెళ్లి సీజన్ను మరింత వైభవంగా మార్చేందుకు తన ప్రత్యేక షోకే ష్ను సిద్ధంచేసిందన్నారు.ఈ లగ్జరీ ట్రంక్ షో దేశవ్యాప్తంగా చైన్నె, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై వంటి నగరాల్లో సందడి చేయనుందన్నారు. భారతీయ వివాహాల రంగుల వైభవాన్ని ప్రతిబింబించేలా, సాంప్రదాయ శిల్పకళతో పాటు ఆధునిక డిజైన్లను మేళవించిన ప్రత్యేక ఐవేర్ కలెక్షన్ను సిద్ధం చేశామన్నారు. ది వెడ్డింగ్ ఎడిట్ ఐదో సీజన్ తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా పేర్కొంటూ, ఐవేర్ షాపింగ్ను ఒక జ్ఞాపకంగా మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ప్రహరీ గోడను
ఢీకొన్న బైక్
తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరుకు చెందిన మురుగన్ (50) పారిశుధ్య కార్మికుడు. అతని కుమారుడు ప్రవీణ్ (19). అతను పరమత్తి వేలూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో 2వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. పరమత్తి వేలూరు సమీపంలోని వెట్టుక్కాట్టు పుదూర్ ప్రాంతానికి చెందిన తంగరాసు కుమారుడు కార్తీ (19). అతను ఓ ప్రైవేట్ కంపెనీలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. స్నేహితులైన ప్రవీణ్, కార్తీ ఇద్దరూ సోమవారం రాత్రి కపిలర్మలై బాలసుబ్రమణ్య స్వామి ఆలయ రథోత్సవానికి బైక్పై వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి వరకు రథోత్సవంలో ఉండి, మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కపిలర్మలై నుంచి బైక్పై ఇంటికి వస్తున్నారు. బైక్ను కార్తీ నడుపుతున్నాడు. అయితే కపిలర్మలై–పరమత్తి వెళ్లే రహదారిలో పరమత్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వస్తున్న సమయంలో బైక్ అదుపు తప్పి పాఠశాల ప్రహరీకి బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడి అదే చోట మృతి చెందారు.


