విజయ్ కోసం నా చిత్రాన్ని వాయిదా వేస్తా..!
తమిళసినిమా: నటుడు శింబు గత 2008లో కథానాయకుడు నటించిన చిత్రం సిలంబాట్టం. నటి స్నేహ, సానా ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఎం. శరణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. లక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై కె మురళీధరన్, వి స్వామినాథన్, టీఎస్.రంగరాజన్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా ఇప్పుడు గతంలో విడుదలై విజయవంతమైన చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అజిత్ హీరోగా నటించిన మంగాత్త చిత్రం రీ రిలీజ్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించింది. కాగా తాజాగా నటుడు శింబు నటించిన సిలంబాట్టం చిత్రం సుమారు 18 ఏళ్ల తర్వాత ఈనెల 6వ తేదీన రిలీజ్ కానుంది. దీన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎథిల్ రాజ్ తన ఎల్మా పిక్చర్స్ సంస్థ ద్వారా రీ రిలీజ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ తమిళనాడులో విడుదల చేస్తోంది. కాగా మంగళవారం నటుడు శింబు తన 43వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిలంబాట్టం చిత్ర మీడియా సమావేశాన్ని స్థానిక ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, దర్శకుడు, నిర్మాత ఇలా పలు ముఖాలు కలిగిన టి రాజేందర్ మాట్లాడుతూ సిలంబాట్టం చిత్రాన్ని దర్శకుడు ఎం శరవణన్ భారీ ఎత్తున రూపొందించారన్నారు. అప్పట్లో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించిన చిత్రం ఇదని పేర్కొన్నారు. నిజానికి ఈరోజు తాను దర్శకత్వం వహించిన ఉయరుళ్ళ వరై ఉష చిత్ర రీ రిలీజ్కు సంబంధించిన మీడియా సమావేశాన్ని నిర్వహించేందుకు తలపెట్టానని, అదేవిధంగా చిత్రాన్ని ఈనెల 6వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నానని చెప్పారు. అలాంటిది సిలంబాట్టం చిత్రాన్ని విడుదల చేస్తున్న ఎథిల్ రాజ్ తన వద్దకు వచ్చి ప్రసాద్ ల్యాబ్ డేటును తనకు ఇవ్వాల్సిందిగా కోరారన్నారు. ఇది తన కొడుకు శింబు నటించిన చిత్రం కావడంతో వెంటనే ఓకే చెప్పానన్నారు. తన కొడుకు కోసం జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధం అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్లో తన మిత్రుడు, నటుడు విజయ్ నటించిన జననాయకన్ చిత్రం విడుదలైతే అప్పుడు కూడా తన చిత్రాన్ని వాయిదా వేయడానికి రెడీ అని టి. రాజేందర్ పేర్కొన్నారు.


