
ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
వేలూరు: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 54వ జన్మదినోత్సవాన్ని గురువారం సాయంత్రం వేలూరు ఉమ్మడి జిల్లాతోపాటు తిరువణ్ణామలై జిల్లాలోను ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. వేలూరులోని టీటీడీ సమాచార కేంద్రంలోని వేంకటేశ్వర స్వామివారికి రాహుల్గాంధీ పేరున ప్రత్యేక పూజలు చేశారు. వేలూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ అధ్యక్షతన అంద పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, సాయంత్రం అన్నదానం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి నిరుపేదలకు బిర్యాని దానం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్ బాషా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్, మణి, కాట్పాడి పట్టణ కార్యదర్శి జార్జీ, మూడో డివిజనల్ అధ్యక్షుడు రఘు, జానకీరామన్ పాల్గొన్నారు. అలాగే తూర్పు డివిజన్ అధ్యక్షుడు జీకే గణేష్ అధ్యక్షతన రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్లో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ముందుగా కోట సమీపంలోని కామరాజర్ విగ్రహానికి పూలమాల వేసి, స్వీట్లు పంచి పెట్టారు. నిరుపేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంచి పెట్టారు.
తిరుత్తణిలో..
తిరుత్తణి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో గురువారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఏజీ. చిదంబరం ఆధ్వర్యంలో తిరుత్తణి కొండ ఆలయంలో రాహుల్గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వర్ణరథోత్సవానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లకు విశేషాలంకరణ చేసి, స్వర్ణ రథంలో కొలువుదీర్చారు. అనంతరం దీపారాధన పూజలు చేశారు. తరువాత ఏజీ.చిదంబరంతోపాటు కాంగ్రెస్ శ్రేణులు రథం లాగి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. రాహుల్గాంధీ పేరిట సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పళ్లిపట్టు యూనియన్ మాజీ చైర్మన్ వెంకట్రాజు, మండల అధ్యక్షులు ఏలుమలై, దేవన్, పట్టణ అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు