
డయాలసిస్ రోగులకు ప్రోటీన్–రిచ్ ఫుడ్ ప్యాకేజీ
● ప్రారంభించిన ఆరోగ్య మంత్రి
సాక్షి, చైన్నె : ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డయాలసిస్ రోగులకు ప్రోటీన్ – రిచ్ ఫుడ్ ప్యాకేజీ పథకం అమల్లోకి వచ్చింది. ఈ సేవలకు బుధవారం చైన్నెలో తొలి విడతగా ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణియన్ ప్రారంభించారు. ఈ ఏడాది బడ్జెట్లో అమోదించిన 118 పథకాల్లో ఒకటైన డయాలసిస్ రోగులకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 9,180 మంది డయాలసిస్ చేయించుకుంటున్నార్న వివరాలను సేకరించారు. వీరికి వారానికి రెండు లేదా మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నారు. వీరికి ప్రొటీన్తో కూడిన ఆహారం అందించేలా ఈ పథకానికి చైన్నె రాజీవ్ గాంధీ జీహెచ్లో బుధవారం ఉదయం శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోని రోగులకు ఈ ప్రోటీన్ ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ మాట్లాడుతూ పేదలు, నిరుపేదలు డయాలసిస్ అంటే వారి ప్రాణాలకు హామీ లేని పరిస్థితిలో ఉండే వారన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత డయాలసిస్ రంగం అభివృద్ధి చెందిందన్నారు. గత నాలుగేళ్లలో 302 కొత్త డయాలసిస్ యంత్రాలు వినియోగంలోకి వచ్చాయని పేర్కొన్నారు. తమిళనాడులో 1,287 డయాలసిస్ యంత్రాలు వినియోగంలో ఉన్నాయని చెప్పారు. డయాలసిస్ తర్వాత రోగులు అసిసి పోతున్నారని, అందుకే వారికి ప్రోటీన్తో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించామన్నారు. డయాలసిస్ తర్వాత రెండు గుడ్లు, చికెన్ పీస్, పాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని అందించే ఈ కార్యక్రమం బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. అయితే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా వారంలోపు విస్తరించి, పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.