
పూండిలో తగ్గుతున్న నీటిమట్టం
తిరువళ్లూరు : చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం వేగంగా తగ్గుతుండడంతో భవిష్యత్తులో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తిరువల్లూరు జిల్లా పూండీలో సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ ఉంది. ఈ రిజర్వాయర్ మొత్తం నీటి సామర్థ్యం 35 అడుగులు. రిజర్వాయర్లు దాదాపు 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. రిజర్వాయర్కు ఆంధ్ర నుంచి వచ్చే కష్ణా జలాలతోపాటు వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరే ప్రధాన నీటి ఆధారంగా ఉంది. పూండికి చేరే నీటిని సాగర్ రిజర్వాయర్లో నిల్వ ఉంచి అక్కడ నుంచి చమరం, సోలవరం, కన్నంకోట రెడ్డిల్స్ తదితర రిజర్వాయర్లకు నీటిని తరలించి, అక్కడ శుద్ధీకరణ చేసిన తర్వాత చైన్నె ప్రజలకు తాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దాదాపు నాలుగు టీఎంసీల నీరు రిజర్వాయర్ నుంచి వృథాగా సముద్రంలో కలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం 23 అడుగుల మీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం వేగంగా తగ్గుతూ ఉన్న క్రమంలో భవిష్యత్తులో తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లోని వెనుక భాగం పూర్తిగా నీరు లేక బోసిపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం రిజర్వాయర్కు కండలేరు నుంచి కృష్ణా జలాలు వస్తున్న క్రమంలో భవిష్యత్తులో నీటిమట్టం కొంతమేరకు పెరిగే అవకాశం ఉంది.
రిజర్వాయర్కు కృష్ణా జలాలు చేరుతున్న పెరగని నీటిమట్టం