చివ్వెంల(సూర్యాపేట) : ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టుకు వచ్చిన కక్షిదారులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మనకు వచ్చే రోగానికి సంబంధించిన సంకేతాలు శరీరంలో ముందుగానే కనిపిస్తాయని, వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే త్వరగా నయమవుతుందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. న్యాయవాదులు, కోర్టు ఆఫిసర్లు, సిబ్బంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, కోర్టు వైద్యాధికారి స్రవంతి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద


