సమస్యలు పరిష్కరించాలి.. | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి..

Mar 18 2025 9:08 AM | Updated on Mar 18 2025 9:03 AM

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వెల్లువెత్తుతున్న వినతులు

అరకొరగానే సమస్యల పరిష్కారం

రెవెన్యూ సర్వే శాఖల్లో

ఎండార్స్‌మెంట్లకే పరిమితం

దాన్నే పరిష్కారంగా చూపిస్తున్న వింత వైనం

పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొంగరాం గ్రామం వద్ద నిర్మించిన జగనన్న కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ సాయంత్రం అయితే సరి గంజాయి బ్యాచ్‌లు, మందుబాబుల వీరంగం అంతా, ఇంతా కాదు. జగనన్న కాలనీ వద్ద రోడ్డు ముందే మందుషాపు పెట్టారు. దీంతో మందుబాబులు పట్టపగలే ఇళ్ల వద్దకు వచ్చి చిందులు వేస్తున్నారు. ఇక్కడ ఇళ్లకు ఏర్పాటు చేసిన పైపులను, ఇంటిపై పెట్టిన వాటర్‌ ట్యాంక్‌లను దొంగతనం చేస్తున్నారు. ఇక్కడ ఉండేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యలను పరిష్కరించాలి.

– కొంగరాం జగనన్న కాలనీ వాసులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌/ శ్రీకాకుళం అర్బన్‌ / శ్రీకాకుళం క్రైం:

ప్రతి సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేకపోతోంది. దీంతో వచ్చిన వారే పదే పదే వినతులు పట్టుకుని ప్రతి వారం లైనులో నిలుచోవాల్సి వస్తోంది. పలు శాఖలకు సంబంధించి 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 7,724 వినతులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 6,555 సమస్యలు పరిష్కారం జరిగినట్టు అధికారులు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ ఈ ‘పరిష్కారం’పైనే బోలెడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యా దులు క్షేత్రస్థాయికి చేరే సరికి ఎండార్సుమెంట్‌తో సరిపెడుతున్నారు. పైగా దీన్నే పరిష్కారంగా చూపిస్తూ.. పైన పేర్కొన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు.

సమస్య పరిష్కారమయ్యేదెలా..?

వాస్తవానికి పింఛను కావాలని ఒక వయోవృద్ధుడు వస్తే, ఆయనకు కలెక్టర్‌ పింఛను మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వంలో అసలు అవకాశమే లేదు. సంబంధిత సైట్‌ను ప్రభుత్వం ఎప్పుడో మూసివేసింది. అలాగే ఇల్లు కావాలని, రేషన్‌ కార్డు కావాలని, లేదా ఉన్న కార్డు నుంచి తొలగిపోవాలన్నా, చేర్పించాలన్నా ప్రస్తుతం ఆ పనులేవీ జరిగే పరిస్థితి లేదు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణమని అధికారులు చెబుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన వినతులన్నీ కేవలం పైకి ఎండార్స్‌ చేస్తూ ఫిర్యాదుదారులను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని సైట్లు లాక్‌

కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్యుల సమస్యలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. కొత్త ఇల్లు రావడం లేదు. పింఛన్లు కూడా కొత్తగా ఇవ్వడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జోలికిపోవడం లేదు. ఉన్న పింఛన్లు కూడా తీసేస్తున్నారు. అధికారులను అడిగితే ‘అన్ని సైట్లు లాక్‌’అని సమాధానం చెబుతున్నారు. దీంతో ప్రజలు వినతి కాగితాలు చేతబట్టుకుని వారం వారం కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో నమోదు..

కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటివరకు ఉన్న స్పందన పేరు మార్చి ప్రజా సమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌) పేరిట గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారుగా 78 రకాల ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఆప్షన్‌ ఇచ్చారు. ఈ శాఖల నుంచి 2024 జూలై నుంచి ఇప్పటి వరకు 7724 వినతులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 6555 సమస్యలు పరిష్కారం జరిగినట్టు అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ సమస్యలు పరిష్కారం జరగడం లేదు. కేవలం అధికారులు ఎండార్సుమెంటు ఇచ్చి వినతి దారుల సమస్యలను వాయిదా వేస్తున్నారు. ఎవరైనా ఇంటి కోసమో, రేషన్‌ కార్డు కోసమే, పట్టా డివిజన్‌కోసమో వస్తే ‘ప్రస్తుతం ఆ ఆప్షన్‌ ప్రభుత్వం లాగిన్‌లో ఇవ్వలేదు. అనుమతి వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తాం’ అని చెప్పి సమస్య పరిష్కారం అయినట్టు ఆన్‌లైన్‌ రికార్డుల్లో చూపిస్తున్నారు.

దీంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో ప్రజలు మళ్లీ మళ్లీ గ్రీవెన్స్‌కు వస్తున్నారు. ఇలా వచ్చిన వినతులు దాదాపు 473 వరకు ఉన్నట్లు గుర్తించి వాటి కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ప్రారంభించారు. కొన్నింటికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం, మరికొన్ని క్షేత్ర స్థాయి అధికారులు జాప్యం చేయడంతో పరిష్కారం లభించడం లేదు. భూ సమస్యలు, జిరాయితీని ప్రభుత్వ భూములుగా రికార్డు చేయడం, రీ సర్వేలో జాయింట్‌ ఎల్‌పీలు సరిచేయాలని ఫిర్యాదులు, రైతుల మధ్య గట్టు వివాదం, డి పట్టాలు సర్వే చేయకపోవడం వంటివాటిలో కొన్నింటిని పరిష్కరించే వీలున్నా.. ప్రభుత్వం చెబుతున్న ఇతర పనుల వల్ల వీటిని పరిష్కరించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

సమస్యలు  పరిష్కరించాలి.. 1
1/4

సమస్యలు పరిష్కరించాలి..

సమస్యలు  పరిష్కరించాలి.. 2
2/4

సమస్యలు పరిష్కరించాలి..

సమస్యలు  పరిష్కరించాలి.. 3
3/4

సమస్యలు పరిష్కరించాలి..

సమస్యలు  పరిష్కరించాలి.. 4
4/4

సమస్యలు పరిష్కరించాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement