అనంతపురం ఎడ్యుకేషన్: రేపటి నుంచి ప్రారంభం కానున్న టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణ పర్యవేక్షణకు జిల్లాల వారీగా పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆర్.నరసింహారావు, శ్రీసత్యసాయి జిల్లా పరిశీలకులుగా సమగ్ర శిక్ష ఎస్పీడీ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విజయేంద్రరావును నియమించారు. సీబీటీ విధానంలో నిర్వహించే టెట్ పరీక్షలను నిస్పక్షపాతంగా విజయంతంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి పరిశీలకులను నియమించినట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సమస్యలకు శాశ్వత
పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలో పేర్కొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తంగా 317 అర్జీలు అందించారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయకుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలి
జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఈఓ కిష్టప్ప, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశమయ్యారు. మౌలిక వసతుల కల్పన కల్పించేందుకు జిల్లాలో 344 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందించి తదుపరి ప్రక్రియలన్నింటినీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.


