రొద్దం: ఎన్నికల సంఘం జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్)లో ఓట్లు గల్లంతు కాకుండా పార్టీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని సానిపల్లి, పెద్దమంతూరు, కలిపి, శేసాపురం గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. ‘సర్’ను సాకుగా చూపి టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేసే అవకాశం ఉందని, గ్రామాలకు బీఎల్ఓలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు వారి వెంట ఉండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదన్నారు. అందువల్ల అర్హులైన వారి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ బీఎల్ఏలపై ఉందన్నారు. ప్రజలు కూడా ఇంటి దగ్గరకు బీఎల్ఓ వచ్చినప్పుడు ఇంట్లో వారి పేర్లు సరిచూసుకుని... జాబితాలో ఓటు ఉన్నట్లు బీఎల్ఓల నుంచి రశీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, రొద్దం మండల బూత్ కన్వీనర్ చిలకల రవి, నాయకులు ఎన్ నారాయణరెడ్డి, సినిమా నారాయణ, సి.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, బీఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు
అత్యంత విలువైనది
పార్టీ బీఎల్ఏలతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


