తనకల్లు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల వాడకం పెరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించి వైరల్ చేసే ఫొటోల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఏది నిజమో...ఏది కల్పితమో తేల్చుకోలేక జనం సతమతమవుతున్నారు. ఒక్కోసారి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా మండలంలో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్గా మారింది. దీంతో అటు అధికారులు...ఇటు ప్రజలు పరుగులు తీశారు. తీరా చూస్తే అంతా ఉత్తిదేనని తేలిపోయింది.
బెంగాల్ టైగర్ ఫొటోతో ప్రచారం..
తనకల్లు మండల పరిధిలోని బొంతలపల్లి సమీపంలోని హంద్రీ–నీవా కాలువ వద్ద పెద్దపులి కనిపించిందంటూ శుక్రవారం కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టారు. అలాగే పరిసర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘‘అవును...నిన్న మేమూ చూశాం’’ అంటూ పలువురు షేర్ చేశారు.దీంతో చట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మండలంలో ఎవరి నోట విన్నా పెద్దపులి గురించే చర్చ జరిగింది. సమాచారం అందుకున్న అటవీశాఖఽ సిబ్బంది హుటాహుటీన గ్రామ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే పెద్దపులి తిరిగిన అనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఈ విషయమై కదిరి ఎఫ్ఆర్ఓ గుర్రప్పను వివరణ కోరగా... కదిరి పరిసర ప్రాంతాల్లో పెద్దపులులు లేవని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. ఫేక్ ఫొటోతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తనకల్లు వద్ద పెద్దపులి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
స్పందించిన అటవీశాఖ..
ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడి


