● ప్లాన్లో భాగంగానే
భద్రత తగ్గించారు
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త టీఎన్ దీపిక ఆరోపణ
చిలమత్తూరు: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి హత్యకు పెద్దకుట్ర జరుగుతోందని, రెండురోజుల క్రితం ఆయన ప్రయాణిస్తున్న కారుకు జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఈ విషయం రూఢీ అవుతోందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. శుక్రవారం ఆమె హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రకాష్రెడ్డిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని ఆయన్ను అంతమొందించేందుకు కుట్రలు సాగుతున్నాయన్నారు. తాజాగా జరిగిన ప్రమాద ఘటనతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరిందన్నారు. కుట్రలో భాగంగానే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గన్మెన్లను తొలగించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ టిప్పర్ ప్రకాష్రెడ్డి కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించడం చూస్తుంటే ముమ్మాటికీ ఇది హత్యకు జరిగిన ప్లాన్గానే తెలుస్తోందన్నారు. ప్రకాష్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అంతమొందించే కుట్రలు సాగించడం దుర్మార్గమైన చర్య అని దీపిక మండిపడ్డారు. ప్రమాద ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రకాష్రెడ్డికి తొలగించిన భద్రతను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.


