హిందూపురం: పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ మంజునాథ్పై విచ్చన రహితంగా దాడి చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కర్ణాటక ప్రాంతంలోని గౌరీబిదనూరు డిపోకు చెందిన బస్సు (కేఏ401157) బెంగళూరు నుంచి బయలుదేరి హిందూపురం పట్టణానికి వస్తోంది. ఈ సందర్భంగా ఓ మహిళ పెద్ద లాగేజీ బ్యాగులో మాంసం పెట్టుకుని ప్రయాణించింది. వాసన వస్తుండటంతో ప్రయాణికులు చెప్పిన మేరకు కండక్టర్ ఆమెను ప్రశ్నించి ఇలా మాంసంతో ప్రయాణించడానికి వీలులేదని చెప్పాడు. హిందూపురం రాగానే ఆమెను దిగిపోవాలని సూచించాడు. దీంతో ఆమె బ్యాగుతో దిగివెళ్లింది. బస్సునేరుగా పాతబస్టాండ్ వద్ద వచ్చి చేరింది. కొంత సమయానికి ఆ మహిళకు సంబంధించిన బంధువులు మూడు ద్విచక్ర వాహనాల్లో వచ్చి బస్సును వాహనాలతో అడ్డగించి కండక్టర్ మంజునాథ్తో వాదిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. బస్సుడ్రైవర్ గంగాధర్ అడ్డుపడటంతో అతన్ని కూడా దుర్భాషలాడి ఎక్కువ మాట్లాడవంటే బస్సు అద్దాలు పగలగొడతామని హెచ్చరించినట్లు బాధితుడు మంజునాథ్ తెలిపారు. ఈ మేరకు బాధితులు, కేఎస్ఆర్టీసీ డిపో అధికారులు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


