
కండక్టర్ నిజాయితీ
కదిరి అర్బన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును తిరిగి అప్పగించి కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. తుమ్మల జెడ్పీ హైస్కూలులో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న డి.ఖానమ్ శుక్రవారం సాయంత్రం విధులు ముగిశాక కదిరికి వచ్చేందుకు బిల్లూరులో ఆర్టీసీ బస్సు ఎక్కింది. ప్రయాణిస్తున్న సమయంలో ఆమె మెడలోని బంగారు చైన్ బస్సులోని పడిపోయింది. ప్రయాణికులందరూ దిగిపోయాక బస్సులో పడి ఉన్న బంగారు చైన్ను కండక్టర్ సుధీంద్ర గమనించి.. డిపో అధికారులకు సమాచారం అందించారు. ఇంటికి వెళ్లాక టీచర్ తన మెడలో చైన్ లేకపోవడాన్ని గమనించి.. వెంటనే బస్ డిపో వద్దకు వెళ్లి సిబ్బందిని ఆరా తీయగా బస్సులో దొరికిన విషయం తెలిపారు. అనంతరం కండక్టర్ను పిలిపించి అందరి సమక్షంలో బాధిత టీచరుకు బంగారు చైనును అప్పగించారు. తన చైను తిరిగి వచ్చినందుకు బాధితురాలు కండక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
● గంట వ్యవధిలోనే గుర్తించిన పోలీసులు
ముదిగుబ్బ: ప్రైవేట్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి గంటలోనే పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. నాగలగుబ్బ గ్రామానికి చెందిన గొడుగు అమీర్ కుమారులు గొడుగు బాబా (6వ తరగతి), గొడుగు జోష్ (3వ తరగతి) ముదిగుబ్బలోని రమణ పబ్లిక్ స్కూలులో చదువుతున్నారు. వీరు హాస్టల్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. అయితే శనివారం సాయంత్రం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పిల్లలు ఇద్దరూ కనిపించకుండా పోయారు. అనంతరం పాఠశాల యాజమాన్యం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ముదిగుబ్బ పోలీసులకు తెలియజేశారు. సీఐ శివరాముడు వెంటనే స్పందించి పిల్లల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నాగలగుబ్బ వైపు నడుచుకుంటు వెళ్లుతున్నట్లు తెలుసుకున్న సీఐ సిబ్బందితో వెళ్లి గంట వ్యవధిలోనే వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

కండక్టర్ నిజాయితీ