
ప్రియురాలిని చంపిన ప్రియుడు
ఆలస్యంగా వెలుగులోకి..
తలుపుల : ప్రియురాలు మరొకరితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఆమెను కడతేర్చిన ప్రియుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు... గాండ్లపెంట మండలం సాదులవాండ్లపల్లికి చెందిన ఆంజినేయులు, సరస్వతి (35) దంపతులు. భర్తతో విభేదాలు రావడంతో ఆమె తన ఇద్దరు కుమారులను తీసుకుని ఎనిమిదేళ్ల కిందట తలుపులకు వచ్చేసింది. బలిజపేటలో నివాసముంటూ కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే బేల్దారి సికిందర్తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అయితే ఆమె ఇటీవల మరొకరితో చనువుగా మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న సికిందర్ పలుమార్లు గొడవపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత చెడింది. ఏప్రిల్ 22న పిల్లలు కదిరిలో ఫంక్షన్కు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సికిందర్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సరస్వతితో మరోమారు గొడవపడి.. నైలాన్ దారంతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. అదే రోజు మధ్యాహ్నం ద్విచక్రవాహనంలో తలుపుల గండి రోడ్డు సమీపంలో గల జమ్ముగడ్డవంక గడ్డ కింద పూడ్చేసి, రాళ్లు పేర్చేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సరస్వతి ఇంటికి యథావిధిగా రాకపోకలు సాగించేవాడు. నెలన్నర దాటినా తల్లి జాడ కనిపించకపోవడంతో పెద్దకుమారుడు తలుపుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితునిగా సికిందర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం చెప్పాడు. తానే సరస్వతిని చంపానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శనివారం శవాన్ని వెలికి తీసి.. పంచనామా చేశారు. ఘటనా స్థలాన్ని రూరల్ సీఐ నాగేంద్ర పర్యవేక్షించారు.