
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
కదిరి టౌన్/ కనగానపల్లి: వేర్వేరు కారణాలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కదిరి పట్టణంలోని కుటాగుళ్లకు చెందిన రమణ (35) బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై విపరీతంగా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన రమణ శనివారం పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి విషమించడంతో రమణ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
● రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన రైతు కూలీ వెంకటేష్ (54)కు కనగానపల్లి సమీపంలో మారెమ్మ గుడి వద్ద వ్యవసాయ పొలం ఉంది. అయితే అందులో పంటలు సరిగా పండకపోవటంతో కుటుంబ సభ్యులంతా కూలి పనులు చేసుకొంటూ జీవించేవారు. ఈ సందర్భంలో అతనికి అనారోగ్య సమస్యలు రావటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భరించలేకపోయిన వెంకటేష్ తన పొలంలోనే నేరేడుచెట్టుకు తాడుతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. ఇతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.