
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.
టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.
తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.
ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది.
ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.
ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.
ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం.
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.
ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు.
అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్లో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.
బీసీసీఐ స్పందన ఇదే..
ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే.
షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు.