ఐపీఎల్-2026 సీజన్లో ఘోర ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్గత విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సీజన్ మధ్యలోనే పాండ్యా తన నిర్ణయాన్ని టీమ్ మేనెజ్మెంట్కు తెలియజేసినట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు అప్పగించింది.
కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్లో క్వాలిఫయర్-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు.
కానీ తాజా ఎడిషన్లో మాత్రం పాండ్యా కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఐపీఎల్-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా? లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఐదు టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై జట్టు పగ్గాలను చేపట్టేందుకు సిద్దంగా లేడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
"ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఛాయిస్. మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్" అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్


