నేడు అండర్–19 ప్రపంచకప్ ‘సూపర్ సిక్స్’ చివరి మ్యాచ్
మధ్యాహ్నం గం.1 నుంచి జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది.
ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది.
ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.
బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది.


