టీమిండియాకు శుభవార్త.. అతడు వచ్చేస్తున్నాడు! | Suryakumar In recovery after successful sports hernia surgery in Germany | Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభవార్త.. అతడు వచ్చేస్తున్నాడు!

Jun 26 2025 12:53 PM | Updated on Jun 26 2025 1:14 PM

Suryakumar In recovery after successful sports hernia surgery in Germany

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)కు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. చాన్నాళ్లుగా ‘స్పోర్ట్స్‌ హెర్నియా’ (sports hernia)తో బాధ పడుతున్న ఈ పవర్‌ హిట్టర్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ స్వయంగా వెల్లడించాడు.

కోలుకుంటున్నా
‘‘స్పోర్ట్స్‌హెర్నియాకు సంబంధించి కుడివైపున పొట్ట దిగువ భాగంలో చేసిన సర్జరీ పూర్తైంది. శస్త్ర చికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయినందుకు సంతోషంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నాను.

బ్యాట్‌ పట్టి మళ్లీ మైదానంలో దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన ఆరోగ్యం, పునరాగమనానికి సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌ అందించాడు. ఆస్పత్రి బెడ్‌పై పడుకుని.. థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తున్న ఫొటో ఇందుకు జతచేశాడు.

సరికొత్త రికార్డు
కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌ తరఫున సూర్యకుమార్‌ అదరగొట్టాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 717 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్‌ నాన్‌- ఓపెనర్‌గా ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ నిలిచాడు.

అంతేకాదు.. ఆడిన పదహారు మ్యాచ్‌లలో వరుసగా 25 కంటే ఎక్కువ స్కోరు చేసి సూర్య సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్‌లో సైతం పాల్గొన్నాడు. అయితే ముంబై లీగ్‌లో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో నొప్పి ఎక్కువవడంతో... ‘స్పోర్ట్స్‌ హెర్నియా’కు చికిత్స తీసుకోవాలని 33 ఏళ్ల సూర్య భావించాడు.

‘సూర్య చాన్నాళ్లుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించిన వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకుంటాడు’ అని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు వరకు భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు లేవు.

బంగ్లాదేశ్‌ పర్యటన
ఈ నేపథ్యంలో చికిత్సకు ఇదే సరైన సమయమని భావించిన సూర్య కోలుకునేందుకు తగినంత సమయం ఉండటంతో వైద్యులను సంప్రదించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో సర్జరీ చేయించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతున్న టీమిండియా.. ఈ ఏడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది.

ఇందులో భాగంగా ఆతిథ్య జటుట్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య జట్టుకు దూరమవుతాడని.. అతడి స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడనే వార్తలు వచ్చాయి.

సూర్య వచ్చేస్తాడు!
అయితే, తాను కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలో అడుగుపెడతానంటూ సూర్య తాజాగా చెప్పడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టాడు. సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 క్రికెట్‌ అద్భుత విజయాలు సాధించింది. శ్రీలంకలో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా తదితర జట్లపై గెలిచింది.

చదవండి: Rohit Sharma On T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్‌ ఛేంజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement