సూర్యకుమార్‌పై వేటు..! టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌? | Shreyas Iyer Is India's Next T20I Captain After Suryakumar Yadav? | Sakshi
Sakshi News home page

BCCI: సూర్యకుమార్‌పై వేటు..! టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌?

Apr 19 2026 3:59 PM | Updated on Apr 19 2026 4:50 PM

Shreyas Iyer Is India's Next T20I Captain After Suryakumar Yadav?

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై వేటు ప‌డ‌నుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వ‌ర్గాలు. సార‌థిగా టీమిండియాకు అద్భుత‌మైన విజ‌యాలు అందించిన సూర్య‌.. బ్యాట‌ర్‌గా మాత్రం అత‌డి ప్ర‌ద‌ర్శ‌న  రోజు రోజుకు దిగ‌జారుతోంది. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ కొన‌సాగిన సూర్య‌కుమార్.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక మాత్రం బ్యాటర్‌గా అతడు విఫలమవవుతున్నాడు.

గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్య కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్‌పై పడుతున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. 

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకొని బోర్డు జట్టును సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సూర్య  స్ధానంలో మ‌రో ముంబై ఆట‌గాడు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కెప్టెన్‌గా నియ‌మించేందుకు భార‌త క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టీ20ల్లో నంబర్ 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రేయస్ అయ్యర్‌కు బంపరాఫర్‌!
శ్రేయ‌స్ అయ్య‌ర్‌ ఇప్ప‌టివ‌ర‌కు జాతీయ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించన‌ప్ప‌టికి.. దేశ‌వాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత‌డికి అనుభ‌వం ఉంది. శ్రేయ‌స్ ప్ర‌స్తుతం పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్‌-2024 సీజన్‌లో కేకేఆర్‌ను అయ్యర్ ఛాంపియన్‌గా నిలిపాడు. 

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా శ్రేయ‌స్‌ డొమాస్టిక్ క్రికెట్‌లో కూడా ముంబై జట్టుకు ఎన్నో సంచలన విజయాలను అయ్యర్ అందించాడు. దీంతో అయ్య‌ర్‌కు జాతీయ జ‌ట్టును న‌డిపించే స‌త్తా కూడా ఉంద‌ని క్రికెట్ పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ప్ర‌స్తుత టీ20 సెటప్‌లో అత‌డు లేడు. కానీ అతడిని తిరిగి తీసుకొచ్చి నేరుగా కెప్టెన్సీ ఇచ్చే అవ‌కాశ‌ముందని బీసీసీఐ వ‌ర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి.

అయ్య‌ర్ ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే జ‌ట్టులో మాత్ర‌మే భాగంగా ఉన్నాడు. అయితే శ్రేయ‌స్ పొట్టి క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. కాబ‌ట్టి అత‌డిని భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకున్న ఆశ్చ‌ర్య‌పోనక్క‌ర్లేదు.

Advertisement
 
Advertisement
Advertisement