Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్పై చర్య తీసుకోవడం కంటికి ఇంపుగా మారింది.
టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబరాల నడుమ ఫైనల్ మ్యాచ్లో మైదానంలో దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అతడు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్లో టిమ్ డేవిడ్ ఆడకుండా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్బ్యాగ్ను విసరడం కనిపించింది. ఇది ఫన్నీగా చేశాడా లేక కావాలనే చేశాడా అన్నది పక్కనబెడితే.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు.. జట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ లేదా మూడో వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించడం లేదా ఏదైనా వస్తువును విసరడం నిబంధనలకు విరుద్ధం.
30 ఏళ్ల టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించినందున తన దుష్ప్రవర్తనతో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజన్లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు.
ఈ టోర్నీలో అతడు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించడం గమనార్హం. మొదటిసారి ఈ సీజన్లో 20వ మ్యాచ్లో (ఒక డీమెరిట్ పాయింట్), 54వ మ్యాచ్లో రెండో ఉల్లంఘన కింద రెండు డీమెరిట్ పాయింట్లు కోత పడింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్ నిబంధన ఉల్లంఘించడంతో నిబంధనల ప్రకారం వచ్చే సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ పడనుంది.


