19 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్ కోసం ముఖం వాచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్ను నిలబెట్టుకుంది.
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.
ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.
ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..

ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.
భువీ, హాజిల్వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.

తన బ్యాటింగ్లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.
కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.
చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు.


