
న్యూఢిల్లీ: వచ్చే ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని ‘పారిస్’ క్రీడల్లో కాంస్యం నెగ్గిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పేర్కొన్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలవడం ద్వారా భారత్ తరఫున అతి పిన్న వయసులో ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్గా రికార్డుల్లోకెక్కిన అమన్... భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తానని అన్నాడు.
‘తదుపరి ఒలింపిక్స్లో పసిడి పతకం గెలవాలనుకుంటున్నా. దాని కోసం మరింత కఠిన సాధన చేస్తా. పారిస్ క్రీడల్లో కాంస్యం గెలవడం ఆనందంగా ఉంది. పతక పోరుకు ముందు బరువు పెరిగినా... పెద్దగా ఆందోళన చెందలేదు’ అని అమన్ అన్నాడు. మంగళవారం స్వదేశానికి చేరుకున్న అమన్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సన్మానించి రూ. 30 లక్షల చెక్ అందజేశారు.