బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రాణాపై ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) కఠిన చర్యలు తీసుకుంది. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో జోష్ ఇంగ్లిస్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకుగానూ ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించింది. రాణా తన తప్పును అంగీకరించడంతో జరిమానా పడలేదు. ఫార్మల్ హియరింగ్ కూడా అవసరం లేకుండా అతి తక్కువ శిక్షతో బయటపడ్డాడు. ఐసీసీ నియమావళి ప్రకారం, రాణా ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు పాల్పడ్డాడు.
రాణా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ఐర్లాండ్ పర్యటనలోనూ ఓ ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించి ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అప్పట్లో రాణా మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు 24 నెలల్లో 4 డీ మెరిట్ పాయింట్లు మూటగట్టుకుంటే సస్పెన్షన్కు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. రాణా ఇకనై జాగ్రత్తగా ఉండకపోతే నిషేధాన్ని ఎదుర్కోక తప్పదు.
ఇంతకీ ఏం జరగిందంటే.. ఆ మ్యాచ్లో రాణా అద్భుతమైన బంతి వేసి ఇంగ్లిస్ను ఔట్ చేశాడు. ఆ వెంటనే శృతిమంచి సంబురాలు చేసుకున్నాడు. ఈ చర్యలు ఇంగ్లిస్ను ప్రేరేపించేలా ఉన్నాయని అంపైర్లు భావించారు. దీంతో రాణాపై డిసిప్లినరి చర్యలు తీసుకున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాణా ఆ వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఫలితంగా తన జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించలేకపోయింది. డక్త్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లోని రెండో వన్డే ఇవాళ జరుగుతుంది.


