ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్ స్టార్ బౌలర్ హర్షిత్ రానా ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
తాజాగా కేకేఆర్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఆకాశ్దీప్ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్ దీప్ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.
‘ఆకాశ్ దీప్ నడుము కింది భాగం స్ట్రెస్కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్దీప్ను కోల్కతా నైట్రైడర్స్ రూ. కోటికి కొనుగోలు చేసింది.
మరోవైపు శ్రీలంక పేసర్ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్ బౌలింగ్ విభాగంలో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెసింగ్ ముజరబానీ, కార్తిక్ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్ బౌలింగ్ను ప్రారంభించింది.
చదవండి: అమ్ముడుపోని బౌలర్ విధ్వంసం!


