కృనాల్ పాండ్యా (PC: BCCI)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ కృనాల్ అదరగొట్టాడు.
ఐదుసార్లు
ఈసారి 226 పరుగులు చేసిన కృనాల్.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్ నిలిచాడు.
ముంబై ఇండియన్స్ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్ గెలిచిన ఈ బరోడా ఆల్రౌండర్... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..
ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై విజయానంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.
అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.
వేలం సమయంలోనే సగం గెలిచేశాము
ఇక తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.
సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది.
ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
కృనాల్తో పాటు వీళ్లు కూడా
ఆర్సీబీ వరుస రెండు టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్, దిగ్గజ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్ హాజల్వుడ్, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్కి ఇది రెండో ట్రోఫీ.
మరో 10 మంది దేవ్దత్ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది.


