‘బంతి మీదే దృష్టి.. బౌల‌ర్ వైపు క‌న్నెత్తి చూడ‌ను!’ | IPL 2026: Vaibhav Sooryavanshi Comments After Match Won Vs RCB | Sakshi
Sakshi News home page

‘బంతి మీదే దృష్టి.. బౌల‌ర్ వైపు క‌న్నెత్తి చూడ‌ను!’

Apr 11 2026 7:21 AM | Updated on Apr 11 2026 8:40 AM

IPL 2026: Vaibhav Sooryavanshi Comments After Match Won Vs RCB

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ కెర‌టం వైభ‌వ్ సూర్య‌వంశీ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. క్రీజులోకి వ‌చ్చిందే మొదలు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న సూర్య‌వంశీ మ‌రోసారి చెల‌రేగిపోయాడు. శుక్ర‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ 26 బంతుల్లోనే 78 ప‌రుగుల విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్‌ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాడు. 

క్రీజులో ఉన్న‌ప్పుడు బౌల‌ర్‌వైపు క‌న్నెత్తి చూడ‌న‌ని, కేవ‌లం బంతిపైనే త‌న దృష్టి ఉంటుంద‌ని వైభ‌వ్ పేర్కొన్నాడు. ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన వైభ‌వ్ సూర్య‌వంశీ మ్యాచ్ అనంత‌రం మాట్లాడాడు.  ‘కేక్ క‌టింగ్ లాంటిది ఏమీ లేదు. ఈరోజు తొంద‌ర‌గా ప‌డుకోవాలి, ఎందుకంటే తెల్ల‌వారి ఉద‌య‌మే మేము ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. నాకు భ‌యం లేద‌ని అనుకోవ‌ద్దు. 

అయితే ప్రాక్టీస్‌లో ఏదైతే అనుస‌రిస్తున్నానో మ్యాచ్‌లోనూ అదే గేమ్‌ను ఆడుతున్నా త‌ప్పిస్తే దానికి అద‌నంగా ఏమీ చేయడం లేదు. ఎదురుగా బుమ్రా, హాజిల్‌వుడ్ లాంటి అంత‌ర్జాతీయ స్టార్ బౌల‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ వారిని ఎదుర్కోవ‌డానికి నా ప్ర‌ణాళిక సిద్ధంగా ఉంటుంది. నా మైండ్‌లో ఒక‌టే ఫిక్స్ అయ్యా. బౌల‌ర్ ఎవ‌ర‌యినా స‌రే బెరుకు లేకుండా ఆడుతూ షాట్స్ ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా. 

క‌నీసం బౌల‌ర్ ఎవ‌ర‌న్న‌ది క‌న్నెత్తి కూడా చూడ‌ను. కేవ‌లం బౌల‌ర్ వేసే బంతిపైనే ఫోక‌స్‌ ఉంటుంది. ఆ బంతి ఎలా వ‌స్తుంది? ఏ షాట్ ఆడాలి అన్నదే మైండ్‌లో తిరుగుతుంది. అందుకే ఎదుట ఎంత పెద్ద బౌల‌ర్ ఉన్నా భ‌య‌ప‌డ‌కుండా నా గేమ్‌ నేను ఆడుకుంటాను. ఇక న‌న్ను గైడ్ చేస్తున్న వాళ్ల‌లో నా తండ్రితో పాటు కోచ్‌లు ఉన్నారు. ముఖ్యంగా రోమీ సార్ నా గార్డియ‌న్‌.  

వీళ్లంతా నా ప్ర‌యాణం ఇప్పుడే ప్రారంభ‌మైంద‌ని, నువ్వు ఈ జ‌ర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంద‌ని, అందుకు ఆట‌పైనే దృష్టి పెట్టాల‌ని ఇత‌ర ఆలోచ‌న‌లు వ‌దిలేయాల‌ని ప‌దే ప‌దే న‌న్ను మోటివేట్ చేస్తుంటారు. ఔటవ్వ‌డంపై పెద్ద‌గా బాధ లేదు. ఎందుకంటే నేను ఉండుంటే నా నుంచి మ‌రో 10 నుంచి 20 ప‌రుగులు వచ్చేవి. టార్గెట్ కూడా రెండు ఓవ‌ర్ల ముందే ఫినిష్ అయిపోయేదేమో. 

ఒక‌వేళ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 10 నుంచి 20 ప‌రుగులు ఎక్కువ చేసేవాళ్ల‌మే. కాబ‌ట్టి నేను పేల‌వ‌మైన షాట్ ఆడి ఔట్ అయితే జ‌ట్టుకు మైన‌స్ అయ్యేది అని బాధ‌ప‌డేవాడిని. కానీ ఆ చాన్స్ తీసుకోలేదు.’అని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్‌ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్‌ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్‌ సూర్యవంశీతో పాటు ధ్రువ్‌ జురేల్‌ (82) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

చదవండి: మొన్న బుమ్రా.. నేడు హాజిల్‌వుడ్‌! ఎవ‌రైతే నాకెంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement