Ind W Vs Pak W: పాక్‌ కెప్టెన్‌ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. ఈ ఫొటో ఎంత అందంగా ఉందో! వైరల్‌

India Women Cricketers Play With Pakistan Skipper Bismah Maroof Infant Photo Viral - Sakshi

ఫొటో ఆఫ్‌ ది డే

ICC Women's World Cup 2022 Ind Vs Pak: ‘దాయాదులు’... ‘చిరకాల ప్రత్యర్థులు’... ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఐసీసీ మేజర్‌ ఈవెంట్లలో ఇరు జట్లు పోటీ పడుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు. టైటిల్‌ గెలవకపోయినా సరేగానీ.. దాయాది చేతిలో ఓడితే మాత్రం అస్సలు జీర్ణించుకోలేరు. 

అందుకు కారణమైన ఆటగాళ్లను ఏ స్థాయిలో ట్రోల్‌ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతారు. అయితే, క్రికెటర్లు మాత్రం ఈ ‘వైరాన్ని’ కేవలం మైదానం వరకే పరిమితం చేస్తారు.

ఒక్కసారి బయట అడుగుపెట్టాక అంతా కలిసిపోయి సరదాగా ఉంటారు. పురుషుల టీ20 ప్రపంచకప్‌-2021లో భారత్‌ పాక్‌ చేతిలో ఓటమి పాలైన తర్వాత మెంటార్‌ ధోని, అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రీడా స్ఫూర్తిని చాటిన తీరు ఇందుకు నిదర్శనం. తాజాగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

ఈ మెగా ఈవెంట్‌లో భారత మహిళా జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో దాయాదిని చిత్తు చేసి గెలుపు సంబరంలో మునిగిపోయింది. పాక్‌ మహిళా జట్టు ఓటమి బాధలో కూరుకుపోయింది. ఇదంతా ఆట వరకే! 

పాక్‌ కెప్టెన్‌ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు
మ్యాచ్‌ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు పాకిస్తాన్‌ జట్టు కెప్టెన్‌ బిస్మా మరూఫ్‌ పట్ల వ్యవహరించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రపంచకప్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ వచ్చిన బిస్మా.. తన చిన్నారి పాపాయిని కూడా వెంట తీసుకువచ్చింది. ఆ చిట్టితల్లిని చూసి ముచ్చటపడిన భారత మహిళా క్రికెటర్లు ఆ ‘అమ్మ’ దగ్గరకు వెళ్లి బుజ్జాయిని కాసేపు ఆడించారు. బిడ్డను ఎత్తుకున్న బిస్మా చుట్టూ చేరి పాపతో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఆమెతో ఫొటోలు దిగారు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఐసీసీ సైతం ఈ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘ఇండియా- పాకిస్తాన్‌ క్రికెట్‌ స్ఫూర్తి గురించి చిన్నారి ఫాతిమా ఇప్పుడే పాఠాలు నేర్చుకుంటోంది’’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు... ‘‘ఫొటో ఆఫ్‌ ది డే.. ఎంత హృద్యంగా ఉంది. అత్యంత అందమైన అద్బుతమైన క్షణాలు ఇవి. హృదయం పరవశించిపోతోంది’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌- 2022
ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ స్కోర్లు:
ఇండియా-244/7 (50)
పాకిస్తాన్‌-137 (43)
102 పరుగుల తేడాతో భారత్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: పూజా వస్త్రాకర్‌

చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top