చెమ్స్ఫోర్డ్: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు.
షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్లో భారత బృందం బరిలోకి దిగుతుంది.
చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం


