
నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నీ బరిలో భారత్
జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్తో మ్యాచ్లు
న్యూఢిల్లీ: జూనియర్ హాకీ ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు నాలుగు దేశాల సిరీస్కు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి 25 వరకు జర్మనీ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆతిథ్య జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్లతో యువ భారత జట్టు తలపడనుంది. భారత జూనియర్ జట్టుకు అరిజీత్ సింగ్ హుందల్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ అలీ వైస్కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టు బుధవారం బెంగళూరు నుంచి బెర్లిన్కు బయలుదేరింది.
శనివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య జర్మనీతో భారత్ తలపడనుంది. అనంతరం ఆదివారం ఆ్రస్టేలియాతో, మంగళవారం స్పెయిన్తో మ్యాచ్లు ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరగనున్న ఈ సిరీస్లోని అన్నీ మ్యాచ్లు బెర్లిన్లో నిర్వహించనున్నారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈ నెల 25న ఫైనల్ జరగనుంది. ‘2025 జూనియర్ హాకీ వరల్డ్కప్నకు ముందు ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతో కీలకం కానుంది.
మెగా టోర్నీకి ఎక్కువ రోజులు లేకపోవడంతో... ఇది సన్నద్ధతకు చక్కగా తోడ్పడనుంది. బలాబలాలను బేరీజు వేసుకోవడంతో పాటు జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు ఉపకరిస్తుంది. ఇంకా మెరుగవ్వాల్సిన అంశాలేంటి అనేదానిపై కూడా ఒక స్పష్టత వస్తుంది. బలమైన ప్రత్యర్థులతో తలపడ్డప్పుడే మన బలహీనతలు బయటపడతాయి’అని హాకీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు భారత్ వేదికగా జూనియర్ హాకీ ప్రపంచకప్ జరగనుంది.