సిరాజ్‌కు కలిసిరాని మూడో టీ20.. బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌.. కెప్టెన్‌ రోహిత్‌ సీరియస్‌

IND Vs SA: Mohammed Siraj Made A Mistake 3rd T20 Rohit Sharma Upset - Sakshi

దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన మూడో టీ20తో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు ఏదీ కలిసిరాలేదు. ఎన్నో అంచనాల మధ్య జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్‌ తన స్థాయి మేర రాణించలేదు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన అతను వికట్లేమీ లేకుండా ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతోపాటు ఫీల్డింగ్‌లోనూ పొరపాట్లు చేసి.. బౌలర్‌ దీపక్‌ చహర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.

తడబడి.. సిక్సర్‌గా
అసలేం జరిగిందంటే.. అప్పటికే పరుగుల వరద పారించిన ప్రొటీస్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ చహర్‌ బౌల్‌ చేసిన చివరి ఓవర్‌లోనూ రెచ్చిపోయారు. ఈక్రమంలో ఓవర్‌ ఐదో బంతికి డేవిడ్‌ మిల్లర్‌ (5 బంతుల్లో 19) బంతిని గాల్లోకి బాదాడు. అది లాంగాఫ్‌లో ఉన్న సిరాజ్‌ వైపుగా వెళ్లింది. కాస్త చాకచక్యంతో దాన్ని ఒడిసిపట్టాల్సిన సిరాజ్‌ తడబడ్డాడు. క్యాచ్‌ అయితే పట్టాడు కానీ, బౌండరీ లైన్‌పై అడుగేశాడు. దాంతో అది సిక్సర్‌ అయింది. అదిచూసి బౌలింగ్‌ చేస్తున్న చహర్‌, కెప్టెన్‌ రోహిత్‌ సిరాజ్‌పై అసహనం వ్యక్తం చేశారు. రోహిత్‌ అయితే, ఏకంగా.. ఏం ఫీల్డింగ్‌ రా బూబూ! అన్నట్టు ఓ లుక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. 
(చదవండి: 'టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి')

అశ్విన్‌ బౌలింగ్‌లోనూ..
అశ్విన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ చివరి బంతికి కూడా సిరాజ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రోసో (వ్యక్తిగత స్కోరు 24) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీపై సిరాజ్‌ అందుకోలేకపోయాడు. అది సిక్స్‌గా మారింది. ఇక మొత్తంగా 20వ ఓవర్‌లో 24 పరుగులు రావడంతో పర్యాటక జట్టు మూడు వికెట్లు కోల్పోయి భారత్‌కు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్‌ ఛేదనలో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్‌ సేన సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది.
(చదవండి: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top