భువనేశ్వర్ కుమార్... ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడిగా వెలుగొందాడు ఈ పేసర్. చివరగా 2022లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తిరిగి పునరాగమనం చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నాడు. దేశీ, లీగ్ క్రికెట్లో మరోసారి తనను తాను నిరూపించుకుంటున్నాడు.
చోటే లేదు!
అయినప్పటికీ సెలక్టర్లు మాత్రం భువీని కనికరించడం లేదు. ఇప్పటికే పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకుడిగా పాతుకుపోగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్ తదితరులు కూడా కీలక సభ్యులుగా కొనసాగతున్నారు. దీంతో భువీకి టీమిండియా తలుపులు దాదాపుగా మొత్తానికే మూసుకుపోయాయి.
అయితే, భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రం భువనేశ్వర్ కుమార్కు మరొక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాడు. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీని చాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన భువీ.. తాజా ఎడిషన్లోనూ రాణిస్తున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ ఈ రైటార్మ్ పేసర్ అదరగొట్టాడు.
అత్యధిక వికెట్ల వీరుడిగా
నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన భువీ.. 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మొత్తంగా 2026 సీజన్లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో కలిపి 17 వికెట్లు పడగొట్టి.. అత్యధిక వికెట్ల వీరుడిగా ప్రస్తుతానికి పర్పుల్ క్యాప్ తన దగ్గర పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ భువీపై ప్రశంసలు కురిపించాడు.
తిరిగి టీ20 జట్టులోకి తీసుకోండి
క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ కనీసం రెండు నుంచి మూడు వికెట్లు తీస్తున్నాడు. గుజరాత్తో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అతడి వయసు 35 లేదంటే 36 ఏళ్లు ఉండొచ్చు. అయితే, ఇదే విధంగా అద్భుతంగా బౌలింగ్ కొనసాగిస్తే.. టీ20 క్రికెట్లో అతడి పునరాగమనం గురించి టీమిండియా సెలక్టర్లు తప్పక ఆలోచించాలి. బుమ్రా- భువీ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. వింటేజ్ భువీ జట్టుకు తప్పక ఉపయోగపడతాడు’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
You miss, I hit! 🎯#BhuvneshwarKumar has dismissed #JosButtler for the 9th time in 20 T20 innings! 🤯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/QnL7Vybkp7
— Star Sports (@StarSportsIndia) April 30, 2026
చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?


