ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్కు తరలించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్గా నిలిచింది.
ఈ మ్యాచ్లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.


