
బీసీసీఐ కొత్త ప్రణాళికలు
హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో మిగిలిన మ్యాచ్లు!
నేడు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీఎల్కు వారం రోజుల పాటు విరామం ఇచ్చిన బీసీసీఐ భారత్, పాక్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాల తర్వాత మళ్లీ కొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితులు మెరుగవుతాయి కాబట్టి వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లను ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచనతో ఉంది.
ఈ వారాంతంలో టోర్నీ మళ్లీ మొదలు కావచ్చని వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15 నుంచే మ్యాచ్లు జరగవచ్చు. అసలు షెడ్యూల్ ప్రకారం మే 25లోపే లీగ్ను ముగించాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
మూడు వేదికల్లో మ్యాచ్లు...
ఐపీఎల్–2025 లీగ్ దశలో మొత్తం 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనిని ‘రద్దు’గా పరిగణించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించాలా లేక మళ్లీ నిర్వహించాలా అనే అంశంపై ఇంకా గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదు. లీగ్ దశలో మరో 12 మ్యాచ్లతో పాటు 4 ప్లే ఆఫ్స్ కలిపి మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
ముందుగా ఊహించినట్లుగానే దక్షిణాదిలో ఉన్న వేదికలను ఎంచుకొని మ్యాచ్లు జరపాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను ఎంపిక చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
ఆటగాళ్లు వెనక్కి వస్తారా...
ఐపీఎల్ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు మిగిలిన మ్యాచ్ల కోసం విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడమే ఇప్పుడు పెద్ద సమస్య. ఐపీఎల్ వాయిదా గురించి తెలిసిన వెంటనే శుక్ర, శనివారాల్లో పలువురు విదేశీ క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ స్వస్థలాలను బయల్దేరి వెళ్లిపోయారు. వీరందరికీ ఐపీఎల్ ఇప్పట్లో మళ్లీ జరగదని, ఏడాది చివర్లో మళ్లీ నిర్వహించవచ్చనే సమాచారమే ఉంది. దాంతో వారంతా వెనక్కి వెళ్లిపోయారు.
ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి తాజా సమాచారాన్ని అందించాయని, మళ్లీ వెంటనే వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కూడా చెప్పినట్లు సమాచారం. కొందరు ఆదివారం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా వారిని ఆగిపోవాలని ఒక ఫ్రాంచైజీ చెప్పగా... మరికొందరు సగం దూరం ప్రయాణించగా, ఎక్కడ ఉన్నారో అక్కడినుంచే వెనక్కి రావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వెళ్లిపోయిన బట్లర్, కొయెట్జీలను వెనక్కి రమ్మని గుజరాత్ టైటాన్స్ కోరింది. అయితే అందరు విదేశీ ఆటగాళ్లు దాదాపు ఒకే మాట మీద ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 25 తర్వాత లీగ్ కొనసాగితే తాము ఉండలేమని తేల్చేశారు. జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఈ రెండు టీమ్ల ప్లేయర్లు మాత్రం అందుబాటులో ఉండే అవకాశాలు పూర్తిగా లేనట్లే.