
చెన్నై: క్వాంట్బాక్స్ చెన్నై గ్రాండ్మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన మాస్టర్స్ కేటగిరీ తొలి రౌండ్ గేమ్లో తెల్ల పావులతో ఆడిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 49 ఎత్తుల్లో అవండర్ లియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. తెలంగాణ రాష్ట్ర యువజన క్రీడల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ తొలి ఎత్తు వేసి అర్జున్–లియాంగ్ గేమ్ను ప్రారంభించారు.
ప్రణవ్ (భారత్)–కార్తికేయన్ మురళీ (భారత్) గేమ్ 44 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–రే రాబ్సన్ (అమెరికా) గేమ్ 59 ఎత్తుల్లో... విదిత్ గుజరాతి (భారత్)–జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) గేమ్ 48 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... విన్సెంట్ కీమెర్ (జర్మనీ) 52 ఎత్తుల్లో నిహాల్ సరీన్ (భారత్)పై విజయం సాధించాడు. ‘మాస్టర్స్’ కేటగిరీలో పది మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లు జరుగుతాయి.
హారిక పరాజయం
మరోవైపు ఇదే వేదికపై జరుగుతన్న చెన్నై గ్రాండ్మాస్టర్స్ చాలెంజర్స్ టోర్నీని హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పరాజయంతో ప్రారంభించింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దీప్తాయన్ ఘోష్తో జరిగిన తొలి గేమ్లో హారిక 44 ఎత్తుల్లో ఓడిపోయింది.
ఇతర గేముల్లో లియోన్ ల్యూక్ (భారత్) 47 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ప్రాణేశ్ (భారత్) 26 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై నెగ్గారు. అభిమన్యు పురాణిక్ (భారత్)–ఆధిబన్ (భారత్) గేమ్ 46 ఎత్తుల్లో... వైశాలి (భారత్)–ఇనియన్ (భారత్) గేమ్ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. చాలెంజర్స్ టోర్నీ విజేతకు వచ్చే ఏడాది ‘మాస్టర్స్’ టోర్నీలో పాల్గొనే అవకాశం ఇస్తారు.