మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. లంచ్‌ సమయానికి టీమిండియా స్కోర్‌ ఎంతంటే..? | ENG VS IND 4th Test: India 321 For 6 At Day 2 Lunch | Sakshi
Sakshi News home page

మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. లంచ్‌ సమయానికి టీమిండియా స్కోర్‌ ఎంతంటే..?

Jul 24 2025 5:52 PM | Updated on Jul 24 2025 6:04 PM

ENG VS IND 4th Test: India 321 For 6 At Day 2 Lunch

మాంచెస్టర్‌ టెస్ట్‌లో భారత్‌ ఓ మోస్తరు స్కోర్‌ దిశగా పయనిస్తుంది. రెండో రోజు లంచ్‌ విరామం సమయానికి టీమిండియా 6 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్‌ (20), రిషబ్‌ పంత్‌ (39) క్రీజ్‌లో ఉన్నారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్‌కు మరో పరుగు మాత్రమే జోడించి జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

జడేజా ఆదిలోనే ఔటైనప్పటికీ శార్దూల్‌ ఠాకూర్‌ (41).. వాషింగ్టన్‌ సుందర్‌ సాయంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. లంచ్‌ విరామానికి కొద్ది సమయం ముందు శార్దూల్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం పంత్‌ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడు. తొలి రోజులో ఆటలో పంత్‌ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గాయం బారిన పడి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. పంత్‌ గాయం తీవ్రమైందే అయినప్పటికీ జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్‌కు దిగాడు. పంత్‌ సేవలు ఈ మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవుతాయని, అతను వికెట్‌కీపింగ్‌ చేయడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3, వోక్స్‌, ఆర్చర్‌, డాసన్‌ తలో వికెట్‌ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement