బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్‌ | Cannot Lose 11 People, Gautam Gambhir Makes STrong Statement On Bengaluru Tragedy, RCB Celebrations | Sakshi
Sakshi News home page

బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్‌

Jun 6 2025 3:32 PM | Updated on Jun 6 2025 5:12 PM

Cannot Lose 11 People, Gautam Gambhir Makes STrong Statement On Bengaluru Tragedy, RCB Celebrations

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్‌ 4న) జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై యావత్‌ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా స్పందించాడు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.

శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా నిన్న బీసీసీఐ హెడ్‌ క్వార్టర్స్‌లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో గిల్‌తో పాటు పాల్గొన్న గంభీర్‌ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు. 

ముందుగా నేను రోడ్‌ షోలకు వ్యతిరేకం. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. విజయోత్సవాల కంటే జనం ప్రాణాలు ముఖ్యం. రోడ్‌ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.

గెలుపు సంబరాలు చేసుకోవద్దని నేను అనను. కానీ దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఇతరుల ప్రాణాలు రిస్క్‌ అయ్యే విధంగా సంబరాలు ఉండకూడదు. ఇంత ప్రాణ నష్టం కలిగించిన రోడ్‌ షోలను భవిష్యత్తులో నిర్వహించకూడదు.

కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్‌ జర్నీలో తొలిసారి టైటిల్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్‌పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని భావించింది. 

ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్‌ టాప్‌ బస్‌లో పరేడ్‌ నిర్వహించాలని ప్లాన్‌ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. 

ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్‌లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement