జిల్లా వ్యాప్తంగా 901 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ప్రాథమిక 567, ప్రాథమికోన్నత 113, ఉన్నత పాఠశాలలు 201 ఉన్నాయి. వీటిలో 67,921 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఏ పాఠశాల చూసినా ఏదో ఒక సమస్యతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వేసవి సెలవుల్లో సమస్యల పరిష్కారానికి ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో ఇరుకు తరగతి గదులు.. శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఇబ్బందులు తప్పేలాలేవు.
ముందుకుసాగని ‘మన బడి’ పనులు
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ పనులు పలు చోట్ల అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 343 ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్స్ కోసం రూ.85కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 52 పాఠశాలలోనే పనులు పూర్తి కాగా మిగతా 291 పాఠశాలలో మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే గతేడాది 846 పాఠశాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.39కోట్లు మంజూరయ్యాయి. అందులో ఇప్పటి వరకు 85 వాటిలో మాత్రమే పూర్తిగా కాగా 636లలో పెండింగ్లో ఉన్నాయి. మరో 79 పాఠశాలలో పనులే ప్రారంభానికి నోచుకోలేదు.
విద్యార్థులు ఉగ్గపట్టాల్సిందే..
అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మొత్తం 357 మంది చదువుతున్నారు. ఇందులో 194 బాలికలు, 163 బాలురు ఉన్నారు. వీరందరికి, ఉపాధ్యాయులకు కలిపి నాలుగు మాత్ర మే మూత్రశాలుండగా బాలురు పూర్తిగా బయటకే వెళ్తున్నారు. మరో 8 మూత్రశాలల నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. మధ్యలోనే నిలిచిపోయాయి. గత ఏడాది నుంచి పనులు ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇలా మొత్తంగా జిల్లాలోని బాలురులకు 77, బాలికలకు 24 చోట్ల మూత్రశాలలు లేవు.
విద్యుత్ సౌకర్యం లేక..
జిల్లాలోని 14 ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చిన్నకోడూరు మండలంలోని విఠాలపూర్, చల్కపల్లి, చౌడారం, గోనెపల్లి, రామూనిపట్ల, బెజ్జంకి మండలంలోని పోతారం(బెజ్జంకి), దేవేంద్రనగర్(హుస్నాబాద్), హుస్సేన్నగర్(నంగునూరు)లో విద్యుత్ సౌకర్యం లేక తిప్పలు తప్పడంలేదు. అలాగే తడ్కపల్లి(సిద్దిపేట అర్బన్), కొండాపూర్(మిరుదొడ్డి), మాదన్నపేట(అక్బర్పేట భూంపల్లి), మాలపల్లి(వర్గల్), తుర్కకాశానగర్ (కొండపాక), శనిగకుంట(నారయణరావుపేట) పాఠశాలలో విద్యుత్ సౌకర్యం లేదని అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ బడులు సమస్యలతోసతమతమవుతున్నాయి. వేసవి సెలవుల్లో మౌలిక వసతుల కల్పనపై విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం దృష్టి సారించకపోవడంతో ఈసారి తిప్పలు తప్పేలాలేవు. మరో ఐదు రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి.
– సాక్షి, సిద్దిపేట
సర్కారు బడి.. సమస్యల ఒడి
మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం
అర్ధంతరంగా నిలిచిన
‘మన బడి’ పనులు
157 పాఠశాలలకు ప్రహరీలు కరువు
101 చోట్ల మూత్రశాలలు లేక
బాలబాలికలకు తిప్పలు
వేసవి సెలవుల్లో
కానరాని వసతుల కల్పన
కిచెన్ షెడ్స్ లేని పాఠశాలలు: 161
ప్రహరీలు లేని బడులు: 157
బాలురలకు మూత్రశాలలు లేనివి: 77
బాలికలకు సైతం లేని స్కూల్స్: 24
విద్యుత్ సౌకర్యం లేనివి: 14
ప్రహరీ లేక
పై ఫొటోలో కనిపిస్తున్నది కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల. ఇందులో దాదాపు 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, కుక్కలు ఆవరణలోనే తిరుగుతుంటాయి. దీనితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానికులు పలు మార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకవెళ్లారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రహరీ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇలా ఒక్క పాఠశాలే కాదు జిల్లాలో 157 పాఠశాలలకు ప్రహరీ లేనివే ఉన్నాయి.


