సాక్షి, సిద్దిపేట: సస్పెండ్కు గురైన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. ప్రభుత్వ మొబైల్ను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పటివరకు సరెండర్ చేయలేదు. రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో వైఫల్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తదితర అంశాలపై ఆశ్రిత్ కుమార్ను రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి సస్పెండ్ చేస్తూ ఈ నెల 5న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వానికి చెందిన మొబైల్ నంబర్ను ఇప్పటి వరకు సరెండర్ చేయకపోవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్లుగా పని చేసిన వారందరూ మొబైల్ నంబర్ 9505507241 వినియోగించగా ఆశ్రిత్ కుమార్ వచ్చిన తర్వాత పలు సమస్యలపై ప్రజలు ఫోన్లు చేస్తుండటంతో ఈ నంబర్ను సీసీకి అందజేశారు. అదే కార్యాలయంలో గతంలో ఏఈ వినియోగించి సరెండర్ చేసిన మొబైల్ నంబర్ 9640445111ను ఆశ్రిత్ కుమార్ వినియోగించారు. ఆశ్రిత్ కుమార్ వినియోగించిన ప్రభుత్వ నంబర్ను సరెండర్ చేయలేదు.
నిలిచిన ప్రొసీడింగ్స్..
ఇందిరమ్మ ఇళ్ల పథకాని సంబంధించిన, ఎన్నికలకు సంబంధించిన, జనన, మరణాల సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఇలా ఓటీపీలన్నీ ఇదే నంబర్కు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి ప్రొసీడింగ్లు ఇవ్వడం నాలుగు రోజులుగా నిలిచిపోయాయి. అలాగే ఓటర్లకు సంబంధించిన పనులు సైతం నిలిచిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ల కోసం లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మొబైల్ నంబర్ సిమ్ను తెప్పించి ఓటీపీలతో అమోదం తెలిపేలా చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. దీనిపై మేనేజర్ శ్రీనివాస్ను సంప్రదించగా తనకు తెలియదని, తెలుసుకుంటానని చెప్పడం గమనార్హం.
సస్పెన్షన్ అయిన కమిషనర్ నిర్వాకం
అదే ఫోన్కు ఓటీపీలు
నిలిచిన పలు అప్రూవల్స్


