ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’ | - | Sakshi
Sakshi News home page

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’

Jan 7 2026 10:01 AM | Updated on Jan 7 2026 10:01 AM

ఆద్యం

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’

విద్యార్థుల వికాసం కోసమే..

వాడీవేడి చర్చలు.. వాదోపవాదాలు

పోటీపడిన సభ్యులతో అట్టుడికిన సభ

మోడల్‌ పార్లమెంట్‌ సెషన్‌ అబ్బురం

కొల్లాం, వల్సాడ్‌ విద్యార్థుల విశేష ప్రతిభ

‘యూత్‌ పార్లమెంట్‌’కు హాజరయ్యేందుకు వస్తున్న అతిథులను స్వాగతిస్తున్న కళాకారులు, చిత్రంలో డూడూ బసవన్న, హరిదాసు వేషధారణలు

వర్గల్‌(గజ్వేల్‌): వాడీవేడి చర్చ.. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు.. సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్ష సభ్యులు.. ప్రధాని, మంత్రుల సమాధానాలు.. సంతృప్తి చెందని సభ్యుల నిరసనలు.. సభ వాయిదా.. ఇలా.. మంగళవారం వర్గల్‌ నవోదయ వేదికగా జాతీయ స్థాయి ‘యూత్‌ పార్లమెంట్‌’ ఆద్యంతం రసవత్తరంగా.. ఆసక్తికరంగా సాగింది.

యూత్‌ పార్లమెంట్‌ పోటీలలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొల్లాం, గుజరాత్‌ రాష్ట్రం వల్సాడ్‌ నవోదయ విద్యార్థులు 55 మంది చొప్పున వేర్వేరుగా గంట పాటు వాడీవేడి ప్రసంగాలతో అదరగొట్టారు. పార్లమెంటేరియన్ల మాదిరి చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్పీకర్‌, ప్రధానమంత్రి, డిప్యూటీ స్పీకర్‌, మంత్రులు, ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్‌ సభ్యులుగా పాత్రలు పోషిస్తూ 55 మంది సభ్యులతో కూడిన ఒక్కో విద్యాలయ జట్టు సభను కొనసాగించారు.

వల్సాడ్‌ విద్యార్థులు ఇలా..

మొదట వల్సాడ్‌ నవోదయ బృందం సెషన్‌ జరిగింది. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సభలో యూత్‌ పార్లమెంటేరియన్లుగా విద్యా విధానంపై, రైల్వే దుర్ఘటనలపై, లోక్‌సభ, అసెంబ్లీకి జరిగే జమిలి ఎన్నికలపై క్వశ్చన్‌ అవర్‌లో ప్రస్తావించారు. జీరో అవర్‌లో పర్యావరణ సమస్య, నీటి కాలుష్యంపై సభ్యులు చర్చించారు. విద్యా బిల్లుపై సమగ్ర చర్చ జరిపారు. అనంతరం బిల్లును సభలో ఆమోదింపజేశారు. సభ వాయిదా వేసి ప్రదర్శన ముగించారు.

కొల్లాం విద్యార్థుల ప్రదర్శన..

కొల్లాం నవోదయ విద్యార్థుల యూత్‌పార్లమెంట్‌ సెషన్‌లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌పై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. క్వశ్చన్‌ అవర్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష విధానం, భారత విదేశాంగ విధానం, రైతుల సమస్యపై ప్రశ్నలతో ప్రస్తావించారు. జీరోఅవర్‌లో విదేశాల్లో భారతీ య విద్యార్థుల వెతలను సభ్యులు ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ అనంతరం సభలో ఆమోదింపజేశారు. రెండు జట్ల నుంచి ఉత్తమ ప్రతిభ చాటిన 16 మందిని పురస్కారానికి ఎంపిక చేశారు.

జ్యోతిప్రజ్వలనతో ప్రారంభం

విద్యాలయ వేదికగా మంగళవారం నిర్వహించిన జాతీయస్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీలకు ముఖ్యఅతిథులుగా మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనిల్‌కుమార్‌, నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్‌ కమిషనర్లు చక్రపాణి, దేవేందర్‌కుమార్‌, ఏఎస్‌ఓ అంకిత్‌ ముద్గల్‌, ఆతిథ్య విద్యాలయ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

సంస్కృతి, సంప్రదాయాలు చాటుతూ..

నవోదయ సందర్శించిన అతిథులను తెలంగాణ సంస్కృతి చాటుతూ, నృత్యాభినయాలతో నవోదయ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రంగురంగుల ముగ్గులు, డూడూ బసవన్నలు, హరిదాసులు, సంక్రాంతి పర్వదినాన్ని మేళవించి అతిథులను స్వాగతించారు.

విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఇలాంటి యూత్‌పార్లమెంట్‌ కార్యక్రమాలు దోహదపడతాయని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. నిజ జీవితంలో కూడా ఈ యువ పార్లమెంట్‌ సభ్యులు ప్రజాప్రతినిధులు కావాలని ఆకాంక్షించారు. భారత ప్రభుత్వ పార్లమెంటరీ మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ చిన్నచిన్న లోపాలు మినహా విద్యార్థుల ప్రదర్శన బాగుందన్నారు. పలు సవరణలు సూచించారు. ఇరుజట్ల ప్రదర్శనలు బాగున్నాయని ఏసీ దేవేందర్‌కుమార్‌సింగ్‌ కితాబునిచ్చారు. ఏసీ ృచక్రపాణి మాట్లాడుతూ యూత్‌పార్లమెంట్‌ లాంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు.

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’ 1
1/2

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’ 2
2/2

ఆద్యంతం ఆకట్టుకున్న ‘యూత్‌ పార్లమెంట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement