ఇదేం భోజనం..?
● మొక్కుబడిగా వండి పిల్లలకు పెడతారా..?
● కలెక్టర్ హైమావతి ఆగ్రహం
● కస్తూర్బా పాఠశాల ఆకస్మిక తనిఖీ
దుబ్బాక: కలెక్టర్ హైమావతి బుధవారం రాత్రి దుబ్బాకలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. వంట గదిలో ఆహార పదార్థాలను, విద్యార్థులకు అందించిన భోజనాన్ని పరిశీలించారు. ఏదో మొక్కుబడిగా కూరగాయలు తీసుకొచ్చి పిల్లలకు సగం కడుపు భోజనం పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటగది పరిసరాలు ఆపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. మీరంతా ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వంటకు, రిజిస్టర్లో రాసిన వాటికి ఏమైనా సంబంధం ఉందా అంటూ ఇన్చార్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ డైట్ పాటించకుండా ఇష్టానుసారంగా రిజిస్టర్ రాసుకుంటే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.బాధులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్ఫెషల్ ఆఫీసర్, అకౌంటెంట్ తన దగ్గరికి వచ్చి రిజిస్టర్ మెయింటేన్ గురించి వివరించాలని టీచర్ను ఆదేశించారు. సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయక పోవడం, లైటింగ్ సరిగ్గా లేక చీకటిగా ఉండటంపై కలెక్టర్ ఆగ్రహించారు. విద్యార్థుల చదువు తదితర విషయాలపై ఆరా తీశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు.
తనిఖీలు ముమ్మరం చేయండి
సిద్దిపేటరూరల్: ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందేలా ఆహార భధ్రత అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ కె.హెమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తనిఖీలో భాగంగా నిత్యావసర పాలు, నూనెలు ఇతర పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఆహార వ్యాపారులు విధిగా అనుమతులు పొంది నియమ, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సురక్షితమైన మంచి ఆహారాన్ని ప్రజలకు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పాఠశాలలో పనిచేసే వంట వారికి, చిన్నారులకు ఆహారం అందించే అంగన్వాడీ కార్యకర్తలకు దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో మద్యాహ్న భోజనం అందించేవారికి, పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్హమీద్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి, అమృత, డీఈఓ శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ ధనరాజ్, డీపీఓ రవిందర్, ఫుడ్సేఫ్టీ అధికారి జయరాం తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పనుల్లో వేగం పెంచండి
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, సబ్ సెంటర్, గ్రామ మహిళా సమాఖ్య, ఫుడ్ గ్రేన్ స్టోరేజ్, పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాలన్నారు. స్థలం దొరకని గ్రామాల్లో పనులను రద్దు చేయాలన్నారు. స్థలం ఉండి పనులు మొదలు పెట్టని ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలని చెప్పారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, సీఈవో రమేష్, డీపీఓ రవీందర్, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ చిరంజీవులు పాల్గొన్నారు.


