ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
జిల్లా ఉద్యానశాఖ అధికారి, సువర్ణ
సిద్దిపేటరూరల్: కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వెంకటాపూర్లోని రైతు వేదికలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ రైతులకు వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ కూరగాయలు సాగు చేస్తున్న రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులలో నీటి వినియోగం పెంచుకోవచ్చన్నారు. మల్చింగ్, ట్రెల్లిస్ పద్ధతులు, సేంద్రియ పద్ధతుల ఉపయోగాలను గురించి వివరించారు. అనంతరం కూరగాయల సాగు రైతులకు ప్లాస్టిక్ పెట్టెలు, వర్మీకంపోస్టు బెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారిణి కౌసల్య, ఉద్యాన విస్తరణ అధికారి రమేశ్, ఏఈఓ నవ్య తదితరులు పాల్గొన్నారు.
డీఆర్ఓ నాగరాజమ్మ
సిద్దిపేటరూరల్: ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సేవలు అభినందనీయమని జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా రెవెన్యూ అధికారి డి.నాగరాజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేసే పద్మ శాలి ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందువరుసలో ఉండాలన్నారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ మరింత ఉన్నత పదవులకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్, గౌరవ అధ్యక్షులు నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు(గజ్వేల్): విద్యా, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు విశ్వవిద్యాలయ క్యాలెండర్ మార్గదర్శకంగా నిలుస్తుందని వైస్ చాన్స్లర్ డాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలనతో అకడమిక్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు భగవాన్, చీనానాయక్, వీరాంజనేయులు, లక్ష్మినారాయణ, సురేష్కుమార్, శ్రీనివాసన్, రాజశేఖర్, సైదయ్య, అశ్విన్, వీరన్న, రామయ్య, రాజేశ్వరి, రోజారాణి, సతీష్ బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
జేఏసీ అధికార ప్రతినిధి బాలలక్ష్మి
దుబ్బాకటౌన్: తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలలక్ష్మి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో చలో సూర్యాపేట తెలంగాణ ఉద్యమకారుల మహాసభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంగా సిద్ధించిన రాష్ట్రంలో ఉద్యమకారుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు వెంటనే గుర్తింపు కార్డులివ్వాలని, 250 గజాలలో ఇంటి స్థలంతో పాటు నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. నెలకు రూ.30 వేల పెన్షన్, వందెకరాలలో అమరవీరుల స్మృతిమనం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనలక్ష్మి, నాయకులు రాజు, ఇంద్ర, లలిత, చిత్తార, సుధాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు


