మొయినాబాద్రూరల్: ద్విచక్రవాహనాల దొంగలను అరెస్టు చేసి కటకటాల పాలు చేసిన ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గత నెలలో జరిగిన చోరీ కేసుల విషయంలో నిందితులను స్థానిక పోలీసులు గాలిస్తుండగా ఆదివారం మొయినాబాద్–సురంగల్ బైపాస్ వద్ద ఇద్దరు అనుమానితులను గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని వాహనంపై మహబూబ్నగర్ జిల్లా గండేడు మండలం గోవింద్పల్లికి చెందిన రామకృష్ణ, అదే మండలానికి చెందిన విజయ్కుమార్ సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించారు. గతంలో ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. మొయినాబాద్లో నాలుగు, చేవెళ్ల, కూకట్పల్లిలో ఒకటి చొప్పున బైక్లు అపహరించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆరు బైక్లతో పాటు నిందితులను అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు మొయినాబాద్ సీఐ మల్లికార్జున్రెడ్డి, క్రైం సీఐ ఉపేందర్, డీఎస్ఐ సుభాష్లను ఉన్నతాధికారులు అభినందించారు.


