ఫొటోగ్రఫీలో ఉచిత శిక్షణ
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఫొటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. నవంబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని, 19 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9490103390, 9490129839 ఫోన్ నంబర్ను ప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–14, 17 యోగా, మల్లకంబ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక నవంబర్ ఒకటిన జెడ్పీ ఉన్నత పాఠశాల నారాయణరావుపేటలో నిర్వహించనున్నట్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య మంగళవారం తెలిపారు. ఆసక్తి కల్గిన క్రీడాకారులు ఒకటో తేదీన ఉదయం 9.30గంటల లోపు పాఠశాలకు రావాలని పేర్కొన్నారు. వివరాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు సతీశ్ ఫోన్ నం. 9948 110433 ను సంప్రదించాలన్నారు.
మద్దూరు(హుస్నాబాద్): మండల కేంద్రంలోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వరదరాజులు మంగళవారం తెలిపారు. 7వ తరగతి చదివి, వంట చేయడంలో అనుభవం ఉన్న మహిళలు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 94939 72765, 93987 90830 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.
కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ ఎల్లయ్య (57) సౌదీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం కుటుంబసభ్యులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... పదహారు నెలల క్రితం ఎల్లయ్య జీవనోపాధి కోసం సౌదీలోని జిద్దాకు వలస వెళ్లాడు. అక్కడ తోటమాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 25న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఎల్లయ్య తిరిగి 27వ తేదీ వరకు ఫోన్ చేయలేదు. అదే రోజు రాత్రి గదిలో ఉరివేసుకున్నాడని తెలిసిందని చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని, మృతదేహాన్ని గ్రామానికి చేర్చాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు.
మద్దూరు(హుస్నాబాద్): ఆర్ఎంపీ వైద్యుడి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. వివరాలు ఇలా... మండలంలోని రేబర్తి గ్రామంలో వైద్యం చాటున చోరీలకు పాల్పడుతున్నట్లు ఆర్ఎంిపీ పూర్ణచందర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మూడు రోజుల నుంచి చేర్యాల సీఐ శ్రీను ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అనుమతులు లేకుండా క్లినిక్ను నడుపుతూ, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చోరీలకు పాల్పడుతున్నాడని, వ్యక్తి మృతికి కారణమైన ఆర్ఎంపిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు లేఖ రాశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ఎంపీ ఇంట్లో మద్దూరు తహసీల్దార్ ఏజీ రహీం పర్యవేక్షణలో లద్నూరు వైద్యాధికారి అర్జున్ , వైద్యుడు మహేందర్తో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టెరాయిడ్స్, ఇంజెక్షన్, గ్లూకోజ్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా వైద్యంతో పాటు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కాగా ఆర్ఎంపీని పోలీసులు విచారిస్తున్నారు.
పటాన్చెరు టౌన్: నకిలీ డాక్యుమెంట్ చూపించి అనుమతులు తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ వివరాల ప్రకారం... అమీన్పూర్ , రంగారెడ్డి జిల్లా మియాపూర్ శివారుకు చెందిన ప్లాట్ నెం.206లో ఎల్లారెడ్డి అనే వ్యక్తి 2022లో హెచ్ఎండీఏకు డాక్యుమెంట్లు చూపించి అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నాడు. కాగా అతడిచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని అధికారులు తేల్చారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసు నమోదైంది.


