
కరెంటు వైరు లాగుతుండగా..
నర్సాపూర్: కరెంటు వైరు లాగుతుండగా సోమవారం ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలిలు ఇలా... నర్సాపూర్లోని ఫైర్ స్టేషన్కు కొత్త భవనం మంజూరు కావడంతో నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. భవనం నిర్మిస్తున్న స్థలం మీదుగా కరెంటు వైర్లు ఉండటంతో వాటిని తొలగించి కొత్త వైరు లాగే పనులు విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్ స్వామికి అప్పగించారు. సోమవారం ఐదుమంది కార్మికులతో ఫైర్ స్టేషన్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి హై టెన్షన్(హెచ్టీ) కరెంటు సప్లై టవర్ మీదుగా పనులు చేపట్టారు. ఈ క్రమంలో కార్మికుడు అనిల్ హెచ్టీ కరెంటు సప్లై టవర్ వద్ద పని చేస్తుండగా మరో కార్మికుడు సంతోష్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని స్తంభం వద్ద పనులు చేస్తున్నారు. అనిల్కు కరెంటు షాక్ తగలడంతో హెచ్టీ సప్లై టవర్ నుంచి మరో స్తంభానికి ఉన్న కండక్టర్ వైరుపై వేలాడాడు. సంతోష్కు షాక్ కొట్టడంతో పక్కనే ఉన్న దుకాణం రేకుల షెడ్డుపై పడ్డాడు. కాగా వైరుపై వేలాడుతున్న అనిల్ను కిందకు దించేందుకు ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రయత్నించే లోపు నేలపై పడ్డాడు. సంతోష్ను రేకుల షెడ్డుపై నుంచి ఫైర్ సిబ్బంది కిందకు దించారు. ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అనిల్ను గాంధీ ఆస్పత్రికి , సంతోష్ను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనిల్ కౌడిపల్లి మండలం గౌతాపూర్ తండా, సంతోష్ అదే మండలం కొత్త చెరువు తండాకు చెందిన వాడు. కాగా ఇద్దరు కొంత కాలంగా కరెంటు కాంట్రాక్టర్ల వద్ద కార్మికులుగా పని చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా.. వైరు లాగే పనులు చేపట్టేందుకు సబ్స్టేషన్ నుంచి విద్యుత్ శాఖ ఉద్యోగి, కాంట్రాక్టర్ ఎల్సీ తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎల్సీ తీసుకుని పనులు చేపట్టారు: ఏడీఈ
ఫైర్ స్టేషన్కు కొత్త భవనం నిర్మించాలనుకున్న చోట కరెంటు వైర్లు ఉన్నందున వాటిని తొలగించి కొత్త వైర్లు లాగాలని ఫైర్ స్టేషన్ అధికారులు కోరారని స్థానిక ఏడీఈ రమణారెడ్డి తెలిపారు. అందులో భాగంగా కాంట్రాక్టర్ స్వామికి పనులు అప్పగించారన్నారు. స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ శివరాం లైన్ క్లియర్ తీసుకున్న తర్వాత పనులు చేపట్టారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
షాక్ కొట్టి ఇద్దరు కార్మికులకు గాయాలు
మెదక్ జిల్లాలో ఘటన

కరెంటు వైరు లాగుతుండగా..