
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలే: అదనపు కలెక్టర్
సంగారెడ్డి జోన్: నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో పీసీసీ ఎన్డీటీ యాక్ట్ అమలుపై బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధించిందని, అందుకు పీసీసీఎన్డీటీ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. సమీక్షలో జిల్లా వైద్యాధికారి నాగనిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.20 వేల
నష్ట పరిహారం ఇవ్వాలి
మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు
పృథ్వీరాజ్ డిమాండ్
రాయికోడ్(అందోల్): అతివృష్టి వల్ల జిల్లాలో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. రాయికోడ్లో బుధవారం పాడైన పత్తి పంటలను సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
పుట్టినరోజు వేడుకలు
నిర్వహించొద్దు
అభిమానులకు ఎమ్మెల్యే
గూడెం మహిపాల్రెడ్డి విజ్ఞప్తి
పటాన్చెరు: ఈ ఏడాది తన పుట్టినరోజును జరుపుకోవడంలేదని అభిమానులు, పార్టీ కార్యకర్తలెవరూ తన జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి మరణం తర్వాత పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని, అభిమానులెవరూ తన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని బుధవారం ఓ ప్రకటనలో కోరారు. ఈనెల 19న తన పుట్టినరోజున సన్నిహితులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు ఆయన తెలిపారు.
తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి
జేడీఏ శివప్రసాద్
కొండాపూర్(సంగారెడ్డి): ఎరువులు కొంటున్న రైతులకు సంబంధిత డీలర్ తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కొండాపూర్లోని పీఏసీఎస్తో పాటు యూరియా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎరువులను అధిక ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. అనంతరం బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా కొండాపూర్లో పత్తిపంటను పరిశీలించారు.
అల్గోల్లో ఎన్సీసీ శిబిరం
జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో తెలంగాణ 33 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్ల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం బుధవారం ప్రారంభమైంది. 600 మంది క్యాడెట్లకు 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేష్ సరియాల్ మాట్లాడుతూ...క్యాడెట్లకు నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవ, జాతీయ ఐక్యత స్ఫూర్తి పెంచుతామన్నారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ జె.రాములు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ జమీల్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవిపూరి సుబేదార్ మేజర్లు పాల్గొన్నారు.