
ఆరోగ్య పరిరక్షణకు ‘రుతు ప్రేమ’
కోహెడరూరల్(హుస్నాబాద్): మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం రుతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీఓ దేవకీదేవి అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో రుతుప్రేమ కార్యక్రమంలో భాగంగా మెన్స్ట్రువల్ కప్, క్లాత్ప్యాడ్ల వినియోగంపై మహిళకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడను శాసించేది రుతుచక్రమని రుతు చక్రం లేకపోతే జీవనమే లేదని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కెమికల్స్ కలిగిన ప్యాడ్ వల్ల మహిళల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ప్రమాదమేనని అన్నారు. క్లాత్ ప్యాడ్స్ మెన్ స్ట్రువల్ కప్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మెన్స్ట్రువల్ కప్ 8 నుంచి 10 ఏళ్ల వరకు వాడొచ్చని ఇవి సురక్షితమైనవని, ఆరోగ్యకరమైనవని అన్నారు. నెలనెలా ప్యాడ్స్ కొనాల్సిన అవసరం లేదని, అలా ప్రతీ మహిళకు ఏటా రూ.1,200 వరకు ఆదా అవుతుందన్నారు. అనంతరం మహిళలు, యువతులకు ఉచితంగా మెన్ స్ట్రువన్ కప్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సెట్విన్ కో ఆర్డినేటర్ అమీనా, ఇన్చార్జి ఎంపీఓ శోభ, పంచాయతీ కార్యదర్శులు నిహారిక, నజియా, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.
డీపీఓ దేవకీదేవి