ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సమీకృత కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ వారం మొత్తం 53 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపాలిటీ, మండల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
న్యాయబద్ధంగా భూసేకరణ చేపట్టాలి
టీజీఐఐసీకి తిమ్మాపూర్లో చేపడుతున్న భూ సేకరణ చట్టబద్ధంగా నిర్వహించాలని రైతులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 38,162లో ఒరిజినల్ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. ఎంజాయ్మెంట్ సర్వేకు పూర్తి భిన్నంగా చేపడుతున్నారని, క్షేత్ర స్థాయిలో వచ్చి చాలామంది రైతులకు గుంట నుంచి రెండు ఎకరాల వరకు తగ్గించారన్నారు. ఇలా చేయడంతో పరిహారం తక్కువగా వస్తోందని వాపోయారు. రైతులకు పాసుపుస్తకాల్లో ఉన్నట్లు పరిహారం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రైతులు రామచంద్రయ్య, యాదయ్య, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.


