మండలిలో ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి
షాద్నగర్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి ప్రశ్నించారు. శాసనమండలిలో సోమవారం ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందేమోనని తాము భావిస్తున్నామని అన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పటిలోపు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం, పెన్షన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పెన్షన్లు అందిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. పంచాయతీ కారోబార్లను జూనియర్ సెక్రటరీలుగా గుర్తించి వారికి గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించినా నేటికీ ఇవ్వడం లేదన్నారు. పంచాయతీ కార్మికులకు రూ.15వేలు వేతనం చెల్లించాలని, ఆరోగ్య భద్రత కార్డులు ఇవ్వాలని, పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.


