ఇబ్రహీంపట్నం రూరల్: జనాభా లెక్కలు 2026 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టాల్సిన ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆదివారం చార్జ్ అధికారులు (తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు), అదనపు చార్జ్ అధికారులు (ఎంపీడీఓ, మేనేజర్ల)కు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనగణన, ఇళ్ల గణన కార్యక్రమంలో భాగంగా 2026లో మొదటి విడత ఇళ్ల గణన పూర్తి డిజటలైజేషన్ పద్ధతిలో చేపట్టడం జరుగుతందని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సమాచారాన్ని సేకరించి వివరాలు నమోదు చేసి జాబితా రూపొందిస్తారన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సెన్సెస్ ఇండెక్స్ పుస్తకాన్ని పూర్తిగా చదివి అవగాహన పెంపొందించుకోవాలని, మాస్టర్ ట్రైనర్లు వివరించే అంశాలను ఆకళింపు చేసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గణన చేపట్టాలన్నారు. 15,16,17 తేదీల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సీపీఓ సౌమ్య, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, ఆర్డీఓలు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్


